1 "మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి యుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ల యందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగువేలమంది ఆయనతో కూడ ఉండిరి."
2 మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.
3 "వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దల యెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములో నుండి కొనబడిన ఆ నూటనలువది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు."
4 "వీరు స్త్రీ సాంగత్య మున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడి కెల్ల ఆయనను వెంబడింతురు, వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు."
5 వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.
6 "అప్పుడు మరియొక దూతను చూచితిని అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను."
7 "అతడు- మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ పరచుడి; ఆయన తీర్పు తీర్చు ఘడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి, అని గొప్ప స్వరముతో చెప్పెను."
8 "వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి- మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను."
9 "మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను- ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన యెడల"
10 "ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును;"
11 "వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని- దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనిన యెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మది లేనివారై యుందురు."
12 దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
13 అంతట ఇప్పటి నుండి ప్రభువు నందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకములో నుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
14 "మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్యు కుమారుని పోలిన యొకడు ఆ మేఘము మీద ఆసీనుడైయుండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను."
15 "అప్పుడు మరియొక దూత దేవాలయములో నుండి వెలి వచ్చి- భూమి పైరు పండియున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను."
16 మేఘము మీద ఆసీనుడైయున్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను.
17 ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను.
18 "మరియొక దూత బలిపీఠము నుండి వెలి వచ్చెను, ఇతడు అగ్ని మీద అధికారము నొందిన వాడు; ఇతడు వాడియైన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి- భూమి మీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను."
19 "కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమును ద్రాక్షల పెద్దతొట్టిలో వేసెను."
20 ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్లెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. |